Yellamma | ‘బలగం’ వంటి హృదయాన్ని తాకే ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు వేణు యెల్దండి తన రెండో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎల్లమ్మ’ అనే ప్రత్యేకమైన టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపికపై సాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడుతున్నట్లు సమాచారం.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్తగా హీరోయిన్ను ఎంపిక చేయాలని భావించారు.
ప్రారంభంలో ఈ పాత్ర కోసం సాయి పల్లవిను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కీర్తి సురేష్ పేరు బలంగా వినిపించింది. ఒక దశలో ఆమె ఎంపిక దాదాపు ఖాయమని కూడా ప్రచారం జరిగింది. వీరితో పాటు శృతి హాసన్, భాగ్యశ్రీ బోర్సే, కన్నడ నటి రుక్మిణి వసంత్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ పాత్రకు దాదాపు ఫైనల్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మృణాల్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.
ఇక ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఫేమస్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘పార్శి’ అనే శక్తివంతమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ఆయన లుక్కు మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ సినిమా తెలంగాణ సంప్రదాయాలు, జానపద కళలు, ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథగా రూపొందుతోంది. గ్లింప్స్లో చూపించిన వేప ఆకులు, పసుపు, కుంకుమ, గజ్జెల శబ్దాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.