Tollywood | సినీ పరిశ్రమకు 2023 సంవత్సరం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. అదే సమయంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. కళాతపస్వి కె. విశ్వనాథ్, విలక్షణ నటుడు జమున, చంద్రమోహన్, శరత్బాబు సహా ఎంతోమంది దిగ్గజ సినీ ప్రముఖులు మరణించారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. మరి కొద్దిరోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. 2023లో సినీ పరిశ్రమకు దూరమైన సినీ ప్రముఖులను ఒకసారి గుర్తుతెచ్చుకుందాం..
సుధీర్ వర్మ
సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ వంటి సినిమాల్లో నటించిన సుధీర్ వర్మ (34 ) ఈ ఏడాది జనవరిలో మరణించారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన వైజాగ్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
జమున ( జనవరి 27 )
వెండితెర సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున కూడా ఇదే సంవత్సరంలో మనకు దూరమయ్యారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున అసలు పేరు జానాభాయి. జ్యోతిష్యుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా మార్చారు. 1957లో విడుదలైన పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయమైన జమున.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి కొన్ని వందల చిత్రాల్లో నటించారు. గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు ఆమె కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి నుంచి లోక్సభకు ఎంపికయ్యారు. వయోభారంతో సినిమాలకు దూరమైన ఆమె.. తన 86వ ఏట జనవరి 27న మరణించారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ ( ఫిబ్రవరి 2)
టాలీవుడ్కు ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) ఈ ఏడాదిలోనే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఫిబ్రవరి 3వ తేదీన కన్నుమూశారు. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విజయవాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీ కెరీర్ను ఆరంభించారు. 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్లోనూ 9 చిత్రాలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో మెప్పించారు.
వాణీజయరామ్ ( ఫిబ్రవరి 4 )
గాయని వాణీ జయరాం (77) అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 4వ తేదీన కన్నుమూశారు. 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన వాణీ జయరామ్.. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీకి ఆమె సేవలందించారు. తన కెరీర్లో 19 భాషల్లో కలిపి 20 వేలకు పైగా పాటలు పాడారు. పదేండ్ల వయసులోనే మొదటిసారి ఆలిండియా రేడియోలో పాటలు ఆలపించడం మొదలుపెట్టారు. 1970లో గుడ్డీ చిత్రం ద్వారా ప్లేబ్యాక్ సింగర్గా మారారు.
నందమూరి తారకరత్న ( ఫిబ్రవరి 18)
నందమూరి తారకరత్న ఈ ఏడాదిలోనే హఠాన్మరణం చెందాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఆ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో ఆయన్ను తొలుత కుప్పం ఆస్పత్రికి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడ దాదాపు 23 రోజుల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ( మే 21 )
తెలుగు ప్రేక్షకులకు మరపురాని పాటలను అందించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన రాజ్ ఈ ఏడాది మే 21న తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. 1954 జూలై 27న జన్మించిన రాజ్ అసలు పేరు.. తోటకూర సోమరాజు. కోటితో కలిసి ఈయన దాదాపు 400 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరుగాంచిన రాజ్-కోటి ద్వయం దశాబ్దాలపాటు సినీ ప్రియులను అలరించారు. ఈ జోడి విడిపోయిన తర్వాత కోటిమ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయినప్పటికీ.. రాజ్ మాత్రం పెద్దగా కనిపించలేదు.
శరత్బాబు ( మే 22)
నటుడిగా వైవిధ్య పాత్రల్లో నటించి మెప్పించిన శరత్ బాబు కూడా ఈ ఏడాదిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మే 22న మరణించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకు చెందిన శరత్బాబు.. చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలని కలలు కన్నారు. కానీ అనుకోకుండా నాటకరంగంలోకి వచ్చారు. 1973లో విడుదలైన రామరాజ్యం సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా, విలన్గా, సహాయనటుడిగా దాదాపు 250 చిత్రాల్లో నటించారు.
రాకేశ్ మాస్టర్ ( జూన్ 18 )
కొరియోగ్రాఫర్గా సక్సెస్ అయిన రాకేశ్ మాస్టర్ ఈ ఏడాది జూన్ 18న కన్నుమూశారు. ఆట, ఢీ వంటి రియాల్టీ షోల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన రాకేశ్ మాస్టర్.. 1500కి పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు.
చంద్రమోహన్ ( నవంబర్ 11)
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కూడా ఈ ఏడాదిలోనే దూరమయ్యారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 11న ఆయన తుదిశ్వాస విడిచారు. 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్.. రంగులరాట్నం (1966)తో సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. హీరోగానే కాకుండా విలన్గా, కమెడియన్గా, సహాయనటుడిగా ఇలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ సినిమాలకు గానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 1987లో చందమామ రావే సినిమాకు గానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.