వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కేరళ సూపర్స్టార్ మమ్ముట్టి అందులో రాజశేఖరరెడ్డి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఇందులో వైఎస్ఆర్గా మమ్ముట్టి నటించగా, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్రలో తమిళహీరో జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని దర్శకుడు మహి వి.రాఘవ్ తెలిపారు.
ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ‘ఇది తెలిసిన కథే అయినా సినిమా ఎలా తీశాం, ఏ ఎమోషన్లో నడిపించామన్నది ఎవ్వరికీ తెలీదు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, తెలియని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. మేం చెబుతున్నది నిజమా? అబద్ధమా? అనేది పక్కనపెడితే… ఆ సన్నివేశాల్లో ఉన్న ఎమోషన్ జనాన్ని కట్టి పడేస్తుంది. తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఎవ్వరినీ కించపరిచేలా ఈ సినిమా ఉండదు. మమ్ముట్టి, జీవాల నటన సినిమాకు హైలైట్’ అని తెలిపారు. జగన్ పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డానని, యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేశానని, దర్శకుడు మహి ఓ తపస్సులా ఈ సినిమా తీశారని, ఇందులో ఎమోషనల్ అంశాలు చాలా ఉంటాయని జీవా తెలిపారు. వైఎస్ భారతి పాత్ర చేయడం పట్ల కథానాయిక కేతకి నారాయణ్ ఆనందం వెలిబుచ్చారు.