Yatra 2 | 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి (YS. Rajashekar) స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్రలో నటించి అలరించాడు. ఇక ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్. రాజశేఖర్రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్తో పాటు, ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం టీజర్ అప్డేట్ ఇచ్చింది. యాత్ర 2 టీజర్ను జనవరి 05న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.