తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఈ నెల 14న విడుదలవుతున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్ నిర్మించింది. తెలుగులో సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో యష్ మాట్లాడుతూ….‘మన సినిమాలు ఇవాళ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. గొప్ప సినిమాల కోసం ఇక్కడి నటీనటులు, సాంకేతిక నిపుణులు పడుతున్న కష్టమే అందుకు కారణం.
ఏ సినిమా అయినా రెండున్నర గంటల సమయంలో ఆ కథలోకి మిమ్మల్ని లీనం చేస్తే చాలు అద్భుత విజయం అందినట్లే. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఒక చిన్న ప్రయత్నంగా ‘కేజీఎఫ్’ మొదలైంది. మీ ఆదరణతో ఇవాళ ఈ స్థాయికి చేరింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కల ఈ సినిమా. తొలిభాగంలో ఆయన క్రియేటివిటీ చూశాం. రెండో భాగం మరింత నచ్చాలని కష్టపడి పనిచేశాం. తల్లీ కొడుకుల కథ ఇది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఉగ్రం’ సినిమా చూసినప్పుడు ప్రశాంత్ నీల్ మంచి దర్శకుడు అవుతాడని అనుకున్నా.
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమాపై మొదట్లో మాకెవరికీ అంచనాలు లేవు గానీ విడుదలయ్యాక అంతా కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఇప్పుడు రెండో భాగంతో చరిత్ర సృష్టించబోతున్నారు. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’లా ‘కేజీఎఫ్ 2’ ఘన విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. ‘మా చిత్రాన్ని మేమే ఆశ్చర్యపోయేంత ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని డబ్బింగ్ సహా అన్ని విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కార్యక్రమంలో నాయిక శ్రీనిధి శెట్టి, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.