సమంత ప్రధాన పాత్రలో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘యశోద’. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకులు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…‘మా చిత్రానికి మంచి స్పందన వస్తున్నది. ఇక్కడే కాదు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఆశ్చర్యపరిచే వసూళ్లు వచ్చాయి.
ఒక మహిళా ప్రధాన చిత్రానికి ఇంత ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. మంచి ప్రయత్నం చేస్తే తప్పక ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి చెప్పారు. ఈ సినిమా సీక్వెల్ గురించి అంతా అడుగుతున్నారు. అది దర్శకులు హరి, హరీష్ చేతుల్లో ఉంది’ అన్నారు. దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ…‘ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం సమంత. ఆమె ఒప్పుకుంటేనే ఈ కథకు ద్వితీయ భాగం తెరకెక్కిస్తాం. ఆమె ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత కథ వినిపించే ప్రయత్నం చేస్తాం’ అన్నారు.
వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ..‘నాయిక ప్రధాన సినిమాలు చేయడం రిస్క్ కాదని ఈ సినిమా నిరూపించింది. అభిరుచి గల నిర్మాతలే ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేయగలరు. మంచి సినిమా పట్ల దర్శకులు హరి, హరీశ్, సమంతకున్న ఇష్టం వల్లే ఈ విజయం దక్కింది. ఇవాళ సమంత మా కార్యక్రమంలో లేకపోవడం లోటుగా భావిస్తున్నా’ అని చెప్పింది.