Yash next Movie | కేజీఎఫ్-2 వచ్చి ఏడాది దాటిపోయింది. అయినా ఇంకా యష్ మాత్రం తన తదుపరి సినిమాను లాక్ చేసుకోయలేదు. కేజీఎఫ్-2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని కన్నడిగుల్లోనే కాదు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. శంకర్, నార్తన్ ఇలా పలువురు పెద్ద పెద్ద డైరెక్టర్ల పేర్లు వినిపించినా అవి పేర్ల వరకే మిగిలిపోయాయి. వీటిపై అటు యష్ టీమ్ కూడా స్పందించకపోవడంతో రూమర్స్గా మారిపోయాయి. నాలుగు నెలల క్రితం ఆయన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగినా.. అది కూడా రూమరం అని తేలడంతో యష్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా యష్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. యష్ నెక్స్ట్ మూవీ ఓ మహిళా దర్శకురాలితో చేయబోతున్నట్లు సమాచారం. నటిగా కెరీర్ ప్రారంభించి తిరుగులేని నాయికగా మలయాళ చిత్ర సీమలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యష్ తదుపరి సినిమా చేయబోతున్నాడట. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ఒక మహిళా దర్శకురాలితో సినిమా చేయబోతున్నాడంటే ఏ రేంజ్ కంటెంట్తో వస్తున్నాడో మనం ఊహించొచ్చు. అయితే ఆ దర్శకురాలు కూడా ఆశా మాశీ ఏం కాదు. తీసింది రెండు సినిమాలే అయినా రెండు ఆణిముత్యాలే.
పదేళ్ల క్రితం లయర్స్ డైస్ అనే హిందీ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇక మళ్లీ ఆరేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టి మిథూన్ అనే సినిమా తెరకెక్కించింది. నాలుగేళ్ల క్రితం మలయాళంలో రిలీజైన ఈ సినిమా ఓ పెద్ద సంచలనం. ఈ సినిమాతో నివిన్ పాలీకి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అలాంటి దర్శకురాలితో యష్ సినిమా చేస్తున్నాడంటే విశేషం అనే చెప్పాలి. కాగా గత సంవత్సర కాలంగా యష్, గీతూ ఈ సినిమా గురించే చర్చలు జరుపుతున్నారట. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా అనిపించిన తర్వాత అధికారిక ప్రకటన ఇచ్చే ప్లాన్లో ఉన్నారట. ఈ సినిమాను కెవిఎన్ బ్యానర్పై కెవిఎన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడట.