అందంతో పాటు ప్రతిభ గల నాయికగా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘ఉరీ, ది సర్జికల్ స్ట్రైక్’ వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించి అగ్ర నాయికగా పేరు తీసుకొచ్చాయి. తన నట ప్రయాణంలో ఎదుర్కొన్న విమర్శలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది యామీ. ఆమె స్పందిస్తూ…‘నేను హృతిక్ రోషన్ సరసన ‘కాబిల్’ చిత్రంలో నటించాను. ఇందులో నా పాత్ర నిడివి తక్కువగా ఉందనే విమర్శలు ఎదుర్కొన్నాను. నేను చేసిన క్యారెక్టర్ అతిథి పాత్రనా? అనే వెటకారాలూ విన్నాను. మీరు ఈ చిత్రంలో బాగా నటించారు అని చెప్పిన వాళ్లే వెనక మరోలా మాట్లాడారు. నా పాత్ర కథలో ఎంత కీలకం అనేది మాత్రమే ఆలోచిస్తా. నిడివి కారణంగా ఓ మంచి చిత్రంలో అవకాశం కోల్పోవడాన్ని ఇష్టపడను. హాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ అయినా తమ క్యారెక్టర్ లెంగ్త్ గురించి పట్టించుకోరు. ప్రాజెక్ట్ నచ్చితే వచ్చి నటిస్తారు. ఇక్కడలా కాదు. పాత్ర నిడివి తక్కువున్నా విమర్శిస్తారు’ అని చెప్పింది. యామీ గౌతమ్ ప్రస్తుతం ‘లాస్ట్’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇందులో ఆమె పాత్రికేయురాలి క్యారెక్టర్లో కనిపించనుంది.