Pavithra Jayaram | అవకాశాలు ఎదిగేలా చేస్తాయి. కష్టాలు దృఢంగా మారుస్తాయి. ఈ మాట టీవీ నటి పవిత్ర జైరామ్ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఆ ప్రయాణంలో ఇప్పుడామె సంతోషాల తీరాన్ని చేరుకున్నారు. జీతెలుగు ‘త్రినయని’ సీరియల్తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న పవిత్ర బుల్లితెర ముచ్చట్లు..
నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే తపనతో మా మాండ్య నుంచి బెంగళూరు వచ్చాను. నేనేం పెద్దగా చదువుకోలేదు. కొన్నిరోజులు హౌజ్ కీపింగ్ వర్క్ చేశాను. బట్టల దుకాణంలో, లైబ్రరీలో ఉద్యోగాలు చేశాను. నా ఇబ్బందులు గమనించి ఓ మిత్రుడు సిరిగంధం శ్రీనివాసమూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ నంబర్ ఇచ్చారు. వెళ్లి కలిశాను. అప్పటికే ఆయన గిరిజనుల మీద డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందిస్తున్నారు. డైరెక్షన్ టీమ్లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అలా నాకు కెమెరా, సినిమా పరిచయం అయింది.
కన్నడ సీరియల్స్లో నటించాలనే ఆలోచన వచ్చింది. ఆడిషన్స్కి వెళ్లాను. చిన్నచిన్న పాత్రలు వచ్చేవి. అదే సమయంలో ‘జోకాలి’ అనే సీరియల్లో హీరో చెల్లెలి పాత్ర దొరికింది. ఆ తర్వాత తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’లో అవకాశం వచ్చింది. అప్పటికి నాకు తెలుగు ఏ మాత్రం తెలియదు. కానీ.. చుట్టూ తెలుగువాళ్లే. అందరూ గలగలా మాట్లాడేస్తుంటే తెల్లమొహం వేసుకొని కూర్చునేదాన్ని. సీరియల్స్ వద్దు.. ఏం వద్దు పారిపోదాం అనుకున్నా. కానీ.. తోటి ఆర్టిస్టులు నా పరిస్థితి అర్థం చేసుకొన్నారు. ధైర్యం చెప్పారు. తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పారు. ప్రస్తుతం ‘త్రినయని’ సీరియల్లో విలన్ పాత్రలో మీరంతా నన్ను చూస్తూనే ఉన్నారు. అంతకంటే ముందు ‘కోడళ్లూ మీకు జోహార్’, ‘స్వర్ణప్యాలెస్’ సీరియల్స్లో చేశాను. నా కష్టమే నన్ను నిలబెట్టింది.
సినిమాల్లోనూ తెలుగులో ఒక సినిమా కూడా చేశాను (బుచ్చినాయుడు కండ్రిగ). కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయింది. ఎంత బిజీగా ఉన్నా.. రోజూ జిమ్కు వెళ్తాను. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందంతోపాటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి. ఫుడ్ విషయంలో పెద్దగా రూల్స్ ఏం లేవు. మధ్యాహ్న భోజనం మాత్రం కడుపు నిండా తింటాను. ఫ్యామిలీ విషయానికొస్తే ఇద్దరు పిల్లలు. పాప, బాబు. మా ఆయన చంద్రకాంత్.
…? సుంకరి