సీనియర్ నటుడు శివాజీరాజా ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కళ్లు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 37 ఏళ్లుగా పరిశ్రమలో రాణిస్తున్నారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఐదొందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో మెప్పించా. ‘మా’ అధ్యక్షుడిగా ఇండస్ట్రీకి సేవ చేశాను. కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశాను. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేయి రూపాయల ఫించన్ను ఐదువేలకు పెంచాను. ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తిచేయడం అలవాటుగా చేసుకున్నా. శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద కళాకారులకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొగిలయ్య వంటి కళాకారుల ప్రతిభను గుర్తించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మొగిలయ్యకు దక్కిన గౌరవానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్గారు. అలాగే పవన్కల్యాణ్, త్రివిక్రమ్ ఆయనకు అవకాశమిచ్చి ప్రోత్సహించారు. అలాంటి కళాకారులు మరింత మంది వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా. నా సొంత సంస్థలో ‘కళ్లు’ సినిమాను మా అబ్బాయితో రీమేక్ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. అవి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’ అన్నారు.