హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు అల్లరి నరేష్. ‘నాంది’ సినిమా విజయంతో తన రూటు మార్చి సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఉగ్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇక తాజాగా మరోసారి నరేష్ అతిథి పాత్రకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. నాగార్జున హీరోగా రచయిత ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధమాకా విజయంతో ఈ రచయిత మంచి పేరు తెచ్చుకున్నారు.
వీరి కాంబోలో తెరకెక్కే సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. 80 దశకంలో సాగే కథతో రూపొందే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు అల్లరి నరేష్ను ఎంచుకున్నారట. ఇక ఈ సినిమాలో మరో గెస్ట్ రోల్లో యువ హీరో రాజ్ తరణ్ నటిస్తారని సమాచారం. ‘ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున కొంత విరామం తీసుకుని చేస్తున్న చిత్రమిదే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.