తమిళ సోయగం త్రిష పట్టిందల్లా బంగారమవుతున్నది. వరుస వైఫల్యాల దశ నుంచి ఈ భామ ఒక్కసారిగా విజయాల బాటపట్టింది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం అపూర్వ విజయంతో త్రిషకు భారీ సినిమా ఆఫర్లొస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో దళపతి విజయ్, కమల్హాసన్ వంటి అగ్ర హీరోల చిత్రాలున్నాయి. ఇదిలావుండగా త్రిష తెలుగులో బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ‘స్టాలిన్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడిన ఈ భామ సుదీర్ఘ విరామం తర్వాత మరలా ఆయనతో జోడీ కట్టబోతున్నదని తెలిసింది
. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా కల్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిషను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఈ సినిమాలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ముఖ్యపాత్రలో కనిపించనుండగా..ఆయనకు జోడీగా శ్రీలీల నటించనుందని సమాచారం. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మించనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.