ఏవీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్న కవివాక్కు చందంగా గతాన్ని తలచుకొని వైరాగ్యం వ్యక్తం చేశారు బిగ్బి అమితాబ్బచ్చన్. కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదని, మార్పును అంగీకరించాల్సిందేనన్నారు. ఇటీవలే 80వసంతాల్ని పూర్తి చేసుకున్న ఈ దిగ్గజ నటుడు మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాన్ని వివరిస్తూ తన వ్యక్తిగత బ్లాగ్లో ఓ ఫిలసాఫికల్ నోట్ను పోస్ట్ చేశారు. గతంలో తనను పలకరించడానికి ముంబయిలోని స్వగృహం జల్సా దగ్గరకు ప్రతి ఆదివారం వందల సంఖ్యలో అభిమానులు వచ్చేవారని, ఇప్పుడు ఎవరో కొందరు మాత్రమే కనిపిస్తున్నారని చెప్పారు.
ఒకప్పటి అభిమానుల కేరింతలు మాయమైపోయాయని, ఇప్పుడు మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసుకునే దృశ్యాలే కనిపిస్తున్నాయని ఆవేదన చెందారు. ‘ఎన్నో ఏళ్లుగా ‘సండేమీట్స్’ పేరుతో అభిమానుల్ని కలుస్తున్నా. ఈ మధ్య వచ్చేవారు తగ్గిపోయారు. ఎవరిలోనూ మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఇవన్నీ గమనిస్తుంటే ఏదీ శాశ్వతం కాదని, సమయం మనకోసం ఆగదనే విషయం అర్థమైంది’ అని అమితాబ్బచ్చన్ పేర్కొన్నారు.