అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై దుమారం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రెండురోజుల క్రితం చేసిన ట్వీట్కు ఏపీ మంత్రి పేర్ని నాని ఘాట్గానే కౌంటర్ ట్వీట్ను పోస్ట్ చేశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలకు లోబడి సినిమా టికెట్ ధరలు నిర్ణయిస్తున్నాయని పేర్కొన్నారు.
సినిమా థియేటర్లు ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని ఆయన అన్నారు. హీరోలకు, నిర్మాతలకు ఇచ్చే రెమ్యూనరేషన్కు ఆర్జీవీ ఒక ఫార్ములా చెప్పారు . ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని, థియేటర్లలలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతుందని ఆర్జీవీకి గుర్తు చేశారు. ‘ రూ. 100 టికెట్ను రూ.వెయ్యి, రూ2వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని..దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు.. డిమాండ్ అండ్ సప్లై అంటారా ? లేక బ్లాక్ మార్కెట్ అంటారా’ చెప్పాలని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
‘ మీరు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సుపై మాట్లాడుతూ.. వినియోగదారులకు సేవలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండని ’ సూచించారు. మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగా ప్రభుత్వం సబ్సిడీని భరించాలని అన్నారు.. సినిమాను మేం నిత్యావసరం లేదా అత్యవసరంగా భావించడం లేదని బదులు ఇచ్చారు. ప్రజల దృష్టిని ఉంచుకుని థియేటరల్లో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.