Star Heroines | సాధారణంగా స్టార్ హీరోయిన్లు అంటే తమ వృత్తిపరమైన కమిట్మెంట్స్తో బిజీగా ఉంటారని తెలిసిందే. అయితే ప్రొఫెషనల్గా తీరిక లేకుండా ఉండే అందాల భామలు టైం దొరికితే కాస్త రూటు మార్చి భక్తి పారవశ్యంలోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో వెళ్తూ రాజ శ్యామల యాగాన్ని (Raja Shyamala Homam) చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకీ స్టార్ హీరోయిన్లు రాజ శ్యామల హోమాన్ని ఎందుకు చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఇండస్ట్రీ సర్కిల్ టాక్ ప్రకారం లీడింగ్ హీరోయిన్ సమంత (Samantha) కొన్ని నెలల ముందు హైదరాబాద్లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజ శ్యామల యాగం నిర్వహించింది. అంతేకాదు పలు ఆలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లో హోమాలు నిర్వహించిన ఫొటోలు కూడా నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika mandanna)కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ కన్నడ సోయగం రాజ శ్యామల యాగం నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి కర్ణాటకకు ప్రత్యేకంగా ఓ బస్సులో పూజారులను కూడా తీసుకెళ్లిందని ఇన్సైడ్ టాక్. వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకునేందుకు వృత్తిపరమైన శత్రువులను నుంచి కాపాడుకునేందుకు సాయంత్రం సమయాన హోమాన్ని నిర్వహించిందట.
ఇటీవలే ఇస్మార్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Aggerwal) కూడా ఇదే యాగాన్ని నిర్వహించింది. రాజశ్యామల హోమం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పూజారులకు కూడా తీసుకెళ్లిందట నిధి అగర్వాల్. ఇక మరోవైపు స్టార్ హీరోయిన్లు కృతి సనన్, పూజా హెగ్డే కూడా వీరి బాటలోనే పయనిస్తున్నారు. గత నెలలో పూజాహెగ్డే పెద్దమ్మ టెంపుల్లో హోమం కూడా జరిపించిందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
మొత్తానికి ఇలా హీరోయిన్లంతా ఒకరి తర్వాత ఒకరు రాజ శ్యామల యాగాన్ని చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. ఈ హీరోయిన్ల జాబితాను గమనిస్తే అందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నవారే. భవిష్యత్లో ప్రొఫెషనల్గా, బిజినెస్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతోనే తారలంతా ఈ రూట్లో వెళ్తున్నారని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.