గతేడాది బింబిసార సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. అదే ఊపులో ఇప్పుడు అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు.. కాని ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రం ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఒకే పోలికలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న ముగ్గురు వ్యక్తులు.. ఒకరి కథలోకి ఒకరు వస్తే తర్వాత ఏం జరుగుతుందో అనేది ఈ సినిమా కథ. ఇంతకు ముందు ట్రిపుల్ రోల్ ఉన్న కథలు తెలుగులో చాలా వచ్చాయి.. కానీ కచ్చితంగా వాళ్ళు అన్నదమ్ములు.. లేదంటే ఏదైనా సంబంధం ఉన్న వ్యక్తులు అన్నట్టు కథలు రాసుకున్నారు దర్శకులు. కానీ ఈసారి మాత్రం కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి అలా కాకుండా డోపల్ గ్యాంగర్ అనే ఒక కొత్త పదాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
అంటే మనుషుల్ని పోలిన మనుషులు అన్నమాట. కాకపోతే వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక చోట కలిసిన తర్వాత.. అందులో ఒక భయంకరమైన నేరస్థుడు ఉంటే.. ఆ తర్వాత కథ ఏంటి అనేది అమిగోస్ సినిమా నేపథ్యం. ఆసక్తికరమైన లైన్ తీసుకున్న దర్శకుడు రాజేంద్ర రెడ్డి స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పకడ్బందీగా లేకపోవడంతో సినిమా తేలిపోయిందనే విమర్శలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా అద్భుతమైన పాయింట్ తో సినిమాను స్టార్ట్ చేసినా కూడా.. దాన్ని కంటిన్యూ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు అంటున్నారు విశ్లేషకులు.
ముఖ్యంగా సినిమా టేక్ ఆఫ్ అయిన విధానం చాలా వేగంగా ఉంటుంది.. కానీ ఆ తర్వాత మాత్రం ఇంటర్వెల్ సీన్ వచ్చేంతవరకు చాలా నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు సెకండ్ హాఫ్ కూడా చాలా హై లో స్టార్ట్ అయిన క్లైమాక్స్ ముందు వరకు నెమ్మదిస్తుంది. కొత్త ఆలోచనకు మరింత పకడ్బందీ స్క్రీన్ ప్లే తోడై ఉంటే కచ్చితంగా బింబిసార కంటే ఇది పెద్ద హిట్ అయి ఉండేది అంటున్నారు కళ్యాణ్ రామ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పటికైనా అమిగోస్ ఒకసారి చూడడానికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. డీసెంట్ వాచ్ విత్ ఇన్నోవేటివ్ ఐడియా అనే టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా అమిగోస్ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ వణికించాడు. ఆయన కోసమే ఓ సారి చూడొచ్చు అన్నట్టు నటించాడు ఈ నందమూరి వారసుడు.