వికాష్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. విశ్వక్సేన్ కీలక పాత్రను పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ నెల 9న విడుదలకానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్ విశ్వక్సేన్ ఎంట్రీ ఇచ్చాక పెద్ద సినిమా అయింది. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందించాం’ అన్నారు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. నా క్యారెక్టర్ కూడా విభిన్నంగా ఉంటుంది. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది’ అని చెప్పారు. అనూహ్యమైన మలుపులతో సాగే కథాంశమిదని హీరో వికాస్ వశిష్ట తెలిపారు. మనసును కదిలించే కథ ఇదని, కాలభైరవ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుందని కథానాయిక ప్రియా వడ్లమాని పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.