Rajinikanth | సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే నిరాధారమైన వార్తలు, ట్రోలింగ్పై కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రజనీకాంత్ బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పలేదనే నెపంతో విజయ్ ఎదుగుదలను చూసి తలైవా ఓర్వలేకపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు.
తన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ-2’ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన విష్ణు విశాల్, రజనీకాంత్ విజయ్పై అసూయపడుతున్నారనే వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. సినీ ప్రముఖులు నాలుగైదు రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వారిపై రకరకాల ఊహాగానాలు అల్లేస్తున్నారని, రజనీకాంత్ విషయంలోనూ అదే జరిగిందని ఆయన మండిపడ్డారు. ఆయన మౌనాన్ని తప్పుగా చిత్రీకరించి చివరకు ఆయనే స్వయంగా మైక్ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునేలా చేశారని, ఇది చాలా బాధాకరమని విష్ణు విశాల్ అన్నారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాలో అగ్ర నటుడిగా కొనసాగుతూ, సాధించిన విజయాలు, అందుకున్న గౌరవం సామాన్యమైనవి కావని, అలాంటి లెజెండరీ నటుడికి వేరొకరిపై అసూయ ఉంటుందని అనడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. సినిమా రంగంలో ఉండే వృత్తిపరమైన పోటీని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడవద్దని విష్ణు విశాల్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఈ వివాదంపై స్పందించిన రజనీకాంత్ కూడా “విజయ్ సీఎం అయితే నాకు ఎందుకు అసూయ ఉంటుంది? ప్రస్తుతం నేను ఏం మాట్లాడినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వివాదాలు సృష్టిస్తున్నారు” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.