సెప్టెంబర్ 5న టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఈ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పలువురు గురువులను, కోవిడ్ సమయంలో సాయమందించిన సినీ కళాకారులను మంచు విష్ణు సన్మానించారు.
‘ఉపాధ్యాయులకు శాశ్వత గౌరవ సూచకంగా, విద్యారంగంలోని వారి సేవలకు గుర్తింపుగా శ్రీ విద్యానికేతన్ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారిని సత్కరించే గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్ మహమ్మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక మంది జీవితాలను కుదిపేసింది.
ఎంతో మంది సినీ ప్రముఖులు, కళాకారులు ఆపదలో ఉన్నవారికి తమవంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారిని పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ సత్యనారాయణ, నటులు నరేశ్, పృథ్వీ, శివ బాలాజీ, గౌతమ్ రాజు, నటి మధుమిత తదితరులు పాల్గొన్నారు. మంచు విష్ణు త్వరలో జరగనున్న మా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.