సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కార్తీక్ దండు రూపొందించారు. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ…‘ఈ విజయం ప్రేక్షకులది. మంచి సినిమాలు చేస్తే మేము తప్పక చూస్తామని వారు మరోసారి నిరూపించారు. ఆకట్టుకునే చిత్రాలు రూపొందించండి మేము చూస్తాం అని ప్రేక్షకులు విసిరిన సవాలుకు జవాబు మా సినిమా. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడిన వైద్యులకు , కష్టకాలంలో అండగా నిలబడిన మా ముగ్గురు మామయ్యలకు కృతజ్ఞతలు’ అని చెప్పారు. దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ…‘మా చిత్రానికి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సంగీతం, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ఇలా ప్రతి విభాగం ఆకట్టుకునేలా పనిచేసింది’ అన్నారు. అతిథిగా వచ్చిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ…‘థ్రిల్లర్, హారర్ జానర్లో సినిమాలు చేయను అని చెప్పిన సాయితేజ్ చేత సింగిల్ సిట్టింగ్లో ఈ కథను ఓకే చేయించుకున్న దర్శకుడు కార్తీక్ దండుకి హాట్సాఫ్. అతను తను అనుకున్న కథను ఎంతో ఆత్మవిశ్వాసంతో తెరకెక్కించాడు. ఇవాళ దర్శకుడు సుకుమార్ శిష్యులంటే ఒక క్వాలిఫికేషన్ ఏర్పడింది’ అన్నారు.