మిస్టిక్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు కార్తీక్ దండు. ఈ చిత్ర విజయం నేపథ్యంలో కార్తీక్ దండు మాట్లాడుతూ…‘హారర్, థ్రిల్లర్ జానర్ కథలు నాకు ఇష్టం. ఈ తరహా మూవీస్ ఎన్నో చూశాను. మన దగ్గర హారర్ కామెడీస్ వస్తున్నాయి గానీ పక్కా హారర్ చిత్రాలు తెరకెక్కడం లేదు. అలాంటి సినిమాను తెరకెక్కించాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. పత్రికల్లో వచ్చిన ఓ వార్త ఈ కథకు స్ఫూర్తినిచ్చింది.
చేతబడి చేస్తుందనే కారణంతో ఓ మహిళను గ్రామ ప్రజలు చంపేసిన వార్తను పేపర్లో చదివాను. మూఢనమ్మకంతో ఒక మహిళను చంపేశారు అని బాధపడ్డాను. ఒకవేళ నిజంగానే ఆమెకు శక్తులు ఉంటే వాళ్లను చంపేస్తుంది కదా అనిపించింది. ఒక దర్శకుడిగా నాలోని ఎమోషన్స్ సుకుమార్ అర్థం చేసుకున్నారు. ఆయన ఈ కథలో కీలక మార్పులు చేశారు.క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సుకుమార్ ఆలోచనే. చంద్రముఖి, అరుంధతి కలిస్తే విరూపాక్ష అనుకోవచ్చు. సాయితేజ్ ఆప్షన్ సుకుమార్ సూచించిందే. నాయిక నందిని పాత్రకు సంయుక్త న్యాయం చేయగలదు అని నమ్మాను.
ఆమె మా నమ్మకాన్ని నిలబెట్టింది. సాయి తేజ్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. యాక్సిడెంట్ తర్వాత పట్టుదలగా స్పీచ్ థెరపీ, డ్యాన్సు క్లాసులు తీసుకుని మూవీ అనుకున్నట్లు పూర్తిచేశారు. సినిమా విడుదలయ్యాక ఇండస్ట్రీలోని దాదాపు అందరు నిర్మాతలు ఫోన్ చేసి అభినందించారు. రవితేజ, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు ప్రశంసించారు. ‘కాంతార’ మూవీలా రెండు మూడు వారాల తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నాం. గతంలో రెండు మూడు ఐడియాలు అనుకున్నాం. ఒకటి సుకుమార్కు నచ్చింది. కొత్త ప్రాజెక్ట్ కుదిరాక వివరాలు చెబుతాను.’ అన్నారు.