Virosh | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్గా అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్పై ఎన్నో వార్తలు వినిపించినప్పటికీ, ఈ జంట మాత్రం ఎప్పుడూ మౌనం పాటించింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెళ్లి ప్రకటన చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించిన విజయ్ దేవరకొండ, తమ పెళ్లి వేడుకకు “వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అనే పేరు పెట్టినట్టు వెల్లడించారు. అభిమానులు ప్రేమగా తమ జంటను “విరోష్” అని పిలుస్తుండటంతో, అదే పేరును పెళ్లి వేడుకకు పెట్టినట్టు తెలిపారు. పెళ్లి కార్డును కూడా అధికారికంగా షేర్ చేస్తూ, ఈ ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు.
వీరిద్దరి పరిచయం గీతా గోవిందం సినిమా సమయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో కలిసి నటించిన సమయంలో వీరి మధ్య బంధం మరింత బలపడిందని ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వకుండా, ప్రైవసీని కాపాడుకున్నారు. అప్పుడప్పుడు బయటకు వచ్చిన వెకేషన్ ఫోటోలు మాత్రం నెటిజన్లలో చర్చకు దారి తీసేవి. వచ్చే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ స్టార్ జంట వివాహం జరగనుంది. రాజసంగా పేరుగాంచిన సిటీ ప్యాలెస్, ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమం రహస్యంగా సాగేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ పెళ్లి వేడుకకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “విరోష్” వెడ్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేశారు. ఈ వేడుకకి భారీ ఎత్తున సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది. టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.