Virgin Boys | ఈ రోజుల్లో థియేటర్స్కి ప్రేక్షకులని తీసుకురావడం చాలా కష్టంగా మారింది. పెద్ద హీరోల సినిమాలకి కూడా ప్రేక్షకులు కరువయ్యారు. ఓటీటీ వచ్చాక థియేటర్స్కి వెళ్లే వారి సంఖ్య క్రమేపి తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో ప్రేక్షకులని ఆకర్షించేందుకు నిర్మాతలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వర్జిన్ బాయ్స్ నిర్మాత టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు , “థియేటర్లలో డబ్బుల వర్షం” అంటూ వినూత్న ప్రమోషన్ చేసి సినిమాకి జోరుగా ప్రమోషన్స్ కల్పించాడు. అయితే ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్రైలర్ లాంచ్ సమయంలో నిర్మాత రాజా దారపునేని ప్రేక్షకులకి పదకొండు ఐ ఫోన్స్ ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్టే, ఓ లక్కీ విన్నర్కు ఐఫోన్ అందజేసి తన మాట నిలబెట్టుకున్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ మిత్రా శర్మ, గీతానంద్ జంటగా నటించిన వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని దర్శకుడు దయానంద్ తెరకెక్కించగా, రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దారపునేని నిర్మించారు. ఇందులో శ్రీహాన్, కౌశల్ మండ, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లూ, అభిలాష్ నటించారు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అయితే హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, నిర్మాత రాజా దారపునేని పాల్గొన్నారు.
అక్కడ ‘వర్జిన్ బాయ్స్’ అడ్వాన్స్ టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకుల లాటరీ తీసుకోగా… చందానగర్కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. మరో 10 మంది లక్కీ విన్నర్స్కు కూడా ఐఫోన్లు ఇవ్వనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సందర్భంగా నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ.. “మా ‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ కాన్సెప్ట్ ప్రేక్షకులను థియేటర్లవైపు ఆకర్షించింది. అన్ని ప్రాంతాల్లో సినిమా మీద చర్చలు జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా అనేక మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ‘థియేటర్లలో డబ్బులు పడితే తొక్కిసలాట జరిగితే పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించినవాళ్లున్నారు కానీ, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మనుషుల ప్రాణాలకు మించి ఏమీ కాదు. ప్లాన్గా, సేఫ్గా కార్యక్రమం నిర్వహించాం” అని తెలిపారు.