ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సాయిపల్లవి, రానా జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం థాంక్స్మీట్ను నిర్వహించారు. ఇందులో చిత్ర బృందంతో పాటు తూము సరళ సోదరుడు తూము మోహన్రావు కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ముప్పైఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. మా కుటుంబంపై కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం ఉండేది. చెల్లెలు సరళ విద్యార్థి సంఘం తాలూకు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది. తను విప్లవాన్ని ప్రేమించింది. అదే విప్లవం కారణంగానే మరణించింది.
మా కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూశాం. దర్శకుడు వేణు ఊడుగుల మాకు చెప్పిన విధంగానే అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇలాంటి గొప్ప చిత్రాలు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించిన తొలి చిత్రమిది. మేమూ కూడా ఓ బయోపిక్ తీశామనే సంతృప్తినిచ్చింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కళాత్మక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సాయిపల్లవి లేకపోతే ఈ సినిమానే లేదు. స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది’ అని చిత్ర సమర్పకుడు సురేష్బాబు తెలిపారు.
సాయిపల్లవి మాట్లాడుతూ ‘మోహన్రావుగారి ఇంటికి వెళ్లినప్పుడు నన్ను వాళ్ల ఆడపడచులా చూసుకున్నారు. చీర పెట్టి దీవించారు. సరళ కుటుంబాన్ని చూసిన తర్వాత నా గుండె బరువెక్కి..కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. గొప్ప మనసున్న మనుషులు మళ్లీ పుడతారు. వాళ్లు కోరుకున్నవి ఇంకో మార్గంలో సాధించుకుంటారని వాళ్లతో చెప్పాను. ‘విరాపర్వం’ సినిమా చేసిందుకు గర్విస్తున్నా’ అని చెప్పింది. ఇలాంటి అర్థవంతమైన, సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రాల్ని ప్రేక్షకులు ముందుకుతీసుకెళ్లాలని దర్శకుడు వేణు ఊడుగుల కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు.