తెలుగు చిత్రసీమలో అనతికాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు యువహీరో కిరణ్ అబ్బవరం. తెరపై పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ సహజత్వంతో కూడిన నటనతో మెప్పిస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకుడు. బన్నీ వాసు నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కిరణ్ అబ్బవరం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి…
తిరుపతి నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడి నుంచి మొదలై కథ అనేక మలుపులతో సాగుతుంది. నైబర్ ఫోన్ నెంబర్స్ (పక్కపక్కన ఉండే ఫోన్ నంబర్ల క్రమం) అనే కాన్సెప్ట్ ఆధారంగా ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఈ కథ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది. వినోదం, ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లర్ అంశాలతో ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ ప్రేక్షకుడి దృక్కోణం నుంచి నేను కథల్ని ఎంపిక చేసుకుంటా. అందుకే తక్కువ వ్యవధిలోనే విభిన్న కథల్లో నటించే అవకాశం దక్కింది.
కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది
ఈ సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఆధ్యాత్మికత ఉట్టిపడే చక్కటి టైటిల్ పెట్టడం అందరిని ఆకట్టుకుంటున్నది. టైటిల్ మాదిరిగానే ఈ సినిమా ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగుతుంది. నటుడిగా నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. గీతా ఆర్ట్స్ వంటి సంస్థలో పనిచేయడం వల్ల నాపై మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నా. ప్రస్తుతం పెద్ద బ్యానర్స్లో సినిమాలు చేస్తున్నా. రాబోవు చిత్రాలు మీటర్, రూల్స్ రంజన్ భారీ స్థాయిలో ఉంటాయి. ప్రతి సినిమాకు పరిణితి చెందుతూ కొత్త విషయాల్ని నేర్చుకుంటున్నా. భవిష్యత్తులో ఫ్యామిలీ కథలతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్స్లో నటిద్దామనుకుంటున్నా.