The Sabarmati Report | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది వచ్చిన 12 ఫెయిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు అవార్డులను కూడా గెలుచుకుంది. అయితే ఈ సినిమా అనంతరం విక్రాంత్ మస్సే మరో సంచలన చిత్రం చేస్తున్నాడు. విక్రాంత్ మస్సే, రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). ఈ సినిమాకు రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ చూస్తే.. గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో జరిగిన మరణకాండపై ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2002లో ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గోద్రా ఘటన అనంతరం అల్లర్లు గుజరాత్ అంతటా వ్యాపించాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు.