NTR – Vijayashanthi | ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఎన్టీఆర్ తిరుగులేని కథానాయకుడు మాత్రమే కాదు.. క్రమశిక్షణ, శ్రమించే తత్వం కలిసి వ్యక్తి అని ప్రశంసిస్తున్నారు. ఎదుటివారి పట్ల ఆయన చూపించి సహానుభూతిని పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి కూడా ఎన్టీఆర్తో తనకు ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఒకసారి ఎన్టీఆర్ను కలవడానికి వెళ్తే ఆయన పట్టించుకోలేదని తెగ బాధపడ్డానని తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్.. తనకు స్వయంగా ఫోన్ చేసి మరీ సారీ చెప్పారని గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఆనాటి సంఘటనను వరుస ట్వీట్ల ద్వారా వివరించారు.
1980లో 14 ఏండ్ల పిల్లగా ఉన్నప్పుడు విజయశాంతి కెరీర్ మొదలైంది. ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించిన సత్యం శివం సినిమాలో చెల్లెలి క్యారెక్టర్లో నటించింది. ఈ సినిమా వచ్చిన దాదాపు ఐదేండ్ల తర్వాత అంటే 1985లో విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ప్రతిఘటన సినిమా రిలీజైంది. ఈ సినిమాకు విజయశాంతి ఉత్తమనటిగా నంది అవార్డు అందుకుంది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. విజయశాంతికి అవార్డు అందించారు. ఆమెను అభినందించి మరిన్ని ప్రజాప్రాయోజిత చిత్రాలతో అలరించాలని ఆశీర్వదించారు. దాని తర్వాత విజయశాంతి సినిమాలతో బిజీ అయిపోయింది. స్టార్ హీరోయిన్గా మారింది. ఆ సమయంలో ఎన్టీఆర్, విజయశాంతి మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
1990ల్లో చిరంజీవితో విజయశాంతి ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ ఏవీఎం స్టూడియోలో జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్.. బ్రహ్మర్షి విశ్వమిత్ర సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఏవీఎం స్టూడియోలోనే జరిగాయి. ఇది తెలిసిన విజయశాంతి.. ఎన్టీఆర్ను కలవాలని డబ్బింగ్ థియేటర్కు వెళ్లింది. అక్కడ వెలుతురు సరిగ్గా లేకపోవడంతో విజయశాంతిని ఎన్టీఆర్ గమనించలేదు. దీంతో విజయశాంతి చాలా బాధపడింది. అయితే ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసింది. ఆ విషయం తెలియగానే మరుసటి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులోని విజయశాంతి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే విజయశాంతి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస ప్రసాద్కు సారీ చెప్పమని చెప్పారు. డబ్బింగ్ థియేటర్లో అమ్మాయిని చూసుకోలేదు. పొరపాటు జరిగిందని తెలియజేయండని అన్నారు.
అంతేకాదు హైదరాబాద్లో విజయశాంతి ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ కాల్ చేసి సారీ చెప్పారు. పొరపాటు జరిగిందమ్మా.. ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. అప్పట్నుంచి విజయశాంతి ఎప్పుడు తన ఇంటికి వెళ్లినా ఎన్టీఆర్ స్వయంగా టిఫిన్ వడ్డించేవారు. అదీ సాటి కళాకారులకు సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చే గౌరవం. అందుకే ఆ మహోన్నత వ్యక్తిని ఎంత ప్రశంసించినా తక్కువే అని విజయశాంతి అంటున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ వరుస ట్వీట్స్ చేశారు. బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన కారణజన్ముడు, యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. వంద సంవత్సరాలైనా.. మరో 100 సంవత్సరాలైనా.. సినిమాకు ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే.. సినిమా కళాకారులకు ఆయన నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే అని పేర్కొన్నారు.