Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనూహ్యంగా ముందంజలో కొనసాగుతోంది. ట్రెండ్స్ ప్రకారం, డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములతో పోలిస్తే టీవీకే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విజయ్కు వీరాభిమాని అయిన మహేంద్రన్ (28) ఓ పుకారును నమ్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు, విజయ్ ఎన్నికల్లో ఓడిపోతాడనే వదంతులు స్థానికంగా వ్యాపించడంతో మహేంద్రన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో చేతిలో ఉన్న కత్తితో తన గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఎన్నికల ఫలితాలపై వ్యాపించిన వదంతులే ఈ దారుణానికి కారణమని తేలింది. విజయ్ ఓడిపోతాడనే ప్రచారాన్ని నిజమని నమ్మిన మహేంద్రన్ మానసిక ఆవేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు కీలక సూచనలు చేస్తున్నాయి. వదంతులను నమ్మకుండా, అధికారిక ఫలితాల కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి టీవీకే ప్రభంజనం సృష్టిస్తున్న ఈ ఎన్నికల్లో, ఒక అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ఉత్కంఠ నడుమ భావోద్వేగాలకు లోనుకాకుండా శాంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.