టాలీవుడ్ నుంచి త్వరలో సందడి చేయబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషిస్తుండగా..బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అనన్య. కాగా లైగర్ ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో విజయ్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఎప్పటికపుడు ఏదో ఒక అప్డేట్తో సినిమాపై అంచనాలు పెంచుతోంది పూరీ అండ్ విజయ్ టీం. కాగా లీడ్ యాక్టర్స్ విజయ్, అనన్య ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train)లో ప్రయాణించారు. ఇంతకీ ఇలా లోకల్ ట్రైన్లో వెళ్లడానికి కారణమేంటనుకుంటున్నారా..? ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య రేడియో ట్రయల్స్లో పాల్గొనాల్సి ఉంది.
అయితే రోడ్ వేలో ట్రాఫిక్ దృష్ట్యా..ప్రత్యామ్నాయంగా ఇద్దరూ ఇలా ట్రైన్లో ప్రయాణించారు. ఇద్దరూ మ్యాచింగ్ జీన్స్ కాంబో ప్యాంట్స్ లో సరదాగా చిల్ అవుట్ అవుతూ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోతోపాటు విజయ్ అనన్య ఒడిలో వాలిపోయిన మరో స్టిల్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ లైగర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లైగర్ పాటలు, ట్రైలర్, తాజాగా విడుదలైన మరో వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.