చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ఈ జంట వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ హిట్ పెయిర్ మరోసారి వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.
స్పై థ్రిల్లర్ కథ ఇదని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలిసింది. ఆమె స్థానంలో రష్మిక మందన్నను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ జంట ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించనుంది.