విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో 1832-33 మధ్య ఏర్పడిన ‘డొక్కల కరువు’ నేపథ్యాన్ని తీసుకొని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను తయారు చేసినట్టు వినికిడి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు స్పందన బావుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్లో సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. మరోవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో సినిమా ‘రౌడీ జనార్దన’కు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీర్తి సురేశ్ కథానాయిక. టాలీవుడ్ సీనియార్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. ఇందులో రాజశేఖర్ మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపిస్తారట. అంతేకాక, ఇందులోని ఓ గెస్ట్రోల్కి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ని దర్శకుడు రవి కిరణ్ కోలా సంప్రదించారట. ఆ వివరాలు త్వరలో తెలియరానున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పానిండియా యాక్షన్ డ్రామా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.