Vijay Devarakonda | టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో, ఇప్పుడు యువ దర్శకుడు శౌర్యువ్తో కొత్త సినిమా ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్తో గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్, ఇటీవల ఈ కొత్త ప్రాజెక్ట్ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఓపెనింగ్కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా విడుదల చేసిన పోస్టర్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అయితే హాయ్ నాన్న తర్వాత కొంత విరామం తీసుకున్న శౌర్యువ్, తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని భావించాడు. ఇందుకోసం కథ కూడా సిద్ధం చేసుకుని చాలా కాలం వేచి చూశాడని సమాచారం. అయితే ఎన్టీఆర్ ‘దేవర’, ‘వార్ 2’, ‘డ్రాగన్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్కు డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో శౌర్యువ్ తన నిర్ణయాన్ని మార్చుకుని విజయ్ దేవరకొండతో ముందుకు వెళ్లాడు. మొదట ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథను, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇమేజ్కు తగ్గట్టుగా శౌర్యువ్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రౌడీ హీరో స్టైల్, మాస్-క్లాస్ మిక్స్ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ను మళ్లీ డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్కు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయడం విశేషం. టెక్నికల్గా హై స్టాండర్డ్స్తో సినిమా రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లు, ఇతర కీలక పాత్రల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. స్టోరీ, ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో మరో కీలక మలుపు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.