Vignesh shivan | కోలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన ధనుష్ – నయనతార – విఘ్నేష్ శివన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్ శివన్, ధనుష్పై తనకున్న అనుబంధాన్ని వ్యక్తపరిచారు. ధనుష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బర్త్డే జూలై 28… అదే రోజు మా నాన్న చనిపోయారు. అందుకే ఆయనలో నేను నా తండ్రిని చూసుకున్నట్లు ఫీల్ అవుతాను” అని తెలిపారు. అంతేకాదు, తన జీవితంలో తాను ఈ స్థాయికి రావడానికి 100% కారణం ధనుష్నే అని స్పష్టం చేశారు. ‘VIP’ సినిమా సమయంలో రెండు సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “ఆయన తిన్నాకే నేను తినేవాడిని. మా మధ్య అంతటి అనుబంధం ఉండేది” అని చెప్పారు.
ప్రస్తుతం తమ మధ్య ఉన్న దూరంపై విఘ్నేష్ బాధని వ్యక్తం చేశారు. ఏం జరిగిందో మాకు కూడా స్పష్టంగా తెలియదు. కానీ ఒక గొప్ప రిలేషన్షిప్ను కోల్పోయాను. అది నా జీవితంలో పెద్ద నష్టం. ఆ స్నేహం ఇప్పుడు లేకపోవడం నాకు సిగ్గుగా అనిపిస్తుంది” అని అన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి పెద్ద సమస్య లేకపోయినా, పరిస్థితులు మారి దూరమయ్యామని పేర్కొన్నారు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం కనుక్కోవచ్చు. కానీ సమస్యే లేకుండా దూరమయ్యాం… దాన్ని ఎలా సరిచేయాలో తెలియడం లేదు అని విచారం వ్యక్తం చేశారు.ధనుష్ పని తీరుపై కూడా విఘ్నేష్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు నిరంతరం పనిచేస్తారు. ఆ డెడికేషన్ చూస్తే నిజంగా భయమేస్తుంది. మమ్మల్ని కూడా ఉదయాన్నే లేపేవారు. ఆయన ఎనర్జీకి సాటి ఉండదు అని తెలిపారు.
ఇంతగా అభిమానించే వ్యక్తి ఫోన్ నంబర్ను కూడా ‘D మిడాస్ స్టార్’గా సేవ్ చేసుకున్నానని వెల్లడించారు. చివరి శ్వాస వరకు ఆయనపై నాకు ఉన్న ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ వివాదానికి మూలం నానుమ్ రౌడీ దాన్ సినిమా. ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించగా, విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార – విఘ్నేష్ ప్రేమలో పడి, తరువాత పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకథ ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే ఆ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్ను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ధనుష్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై నయనతార ఓపెన్ లెటర్ విడుదల చేసి, కేవలం 3 సెకన్ల విజువల్స్ కోసం రూ.10 కోట్ల పరిహారం కోరారని వెల్లడించారు. దీంతో ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అప్పుడు సోషల్ మీడియాలో ధనుష్పై విమర్శలు చేసిన విఘ్నేష్ శివన్, ఇప్పుడు పూర్తిగా భిన్నంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.