ముంబై : లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో ఆమె చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు గురువారం ఉదయం స్పష్టం చేశారు.
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ను గత శనివారం ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. వయసు రీత్యా ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మంగళవారం రోజు మంగేష్కర్ మేనకోడలు రచన షా మీడియాతో మాట్లాడారు. లతా మంగేష్కర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సూచనల మేరకే ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులంతా ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మంగేష్కర్ ఆరోగ్యం కుదుటపడుతుందని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటారని రచన ఆశాభావం వ్యక్తం చేశారు.
2019, నవంబర్లో లతా మంగేష్కర్కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే లతా మంగేష్కర్కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తినట్లు ఆమె సోదరి ఉషా నాడు తెలిపారు.
ఏడు దశాబ్దాల పాటు ఆమె ఎన్నో వేల పాటలు పాడారు. దాదాపు వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు ఆలపించారు. తెలుగులోనూ ఆమె పాటలు రికార్డు సృష్టించాయి. ప్రాంతీయ భాషల్లోనే కాకుండా.. విదేశీ భాషల్లోనూ లతా మంగేష్కర్ పాటలు ఆలపించి.. వరల్డ్ మ్యూజిక్ లవర్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. 2001లో లతా మంగేష్కర్ను భారతరత్న అవార్డు వరించింది. ఈ అవార్డుతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పలు జాతీయ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి.