సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో త్రివిక్రమ్-వెంకటేష్ కూడా ఒకటి. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు రైటర్గా పని చేశారు త్రివిక్రమ్. దాంతో వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం-ఏకే 47’ అందరిలో ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శనివారం టీజర్ను విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబం తాలూకు సరదాలు, అల్లరి.. చివరగా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిక్రమ్ తనదైన సంభాషణల ఛమక్కు చూపించగా, వెంకటేష్ చక్కటి హాస్యంతో సన్నివేశాలను రక్తికట్టించారు.
చివరగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు కథేమిటో అనే ఆసక్తిని క్రియేట్ చేశాయి. ‘నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు. కానీ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను’ ‘నది కట్టుదాటితే వరద అంటారు. సముద్రం దాటితే ఉప్పెన అంటారు. అదే సామాన్యుడు దాటితే బలమైన పదం మీరే వెతకండి సార్’ అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ హైలైట్గా నిలిచాయి. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ప్రజ్వల్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.