బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జనవరి 12న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ‘మా బావ మనోభావాలు..’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు.
ఈ పాటను థమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ పాడారు. బాలకృష్ణ, చంద్రిక రవిపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..‘లిరికల్ పాట కాబట్టి ఇదొక శాంపిల్ మాత్రమే. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ…‘బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు చిత్రాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అంత పవర్ఫుల్గా ఉంటుంది’ అన్నారు.