‘ఇప్పటివరకు చూడని ఓ అద్భుతమైన పాయింట్ ‘వీరసింహారెడ్డి’ కథలో ఉంటుంది. అదేమిటో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే’ అన్నారు చిత్ర మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ప్రస్తుతం తెలుగులో అగ్రశ్రేణి సంభాషణల రచయితగా దూసుకుపోతున్నారాయన. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలందించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం సాయిమాధవ్ బుర్రా పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘బాలకృష్ణ అభిమానులు కోరుకునే విధంగా మాస్ డైలాగ్స్ రాశాను. కమర్షియల్ సినిమాకు ఇలాంటి కథ దొరకడం చాలా అరుదు. ఈ కథలో భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు స్ఫూర్తిపొందే అన్ని అంశాలుంటాయి.
కథను అంగీకరించిన తర్వాత సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ బాలకృష్ణగారు జోక్యం చేసుకోరు. అదే ఆయనలోని గొప్పతనం. రచయితగా నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతున్నది. నేను మాత్రమే చెప్పాల్సిన కథ అనుకుంటే అప్పుడు దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. రచయితగా ప్రతి సినిమా ఓ సవాలుగానే భావిస్తా. చిన్నా పెద్ద సినిమాలు అనే భేదాలు పెట్టుకోను. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ప్రాజెక్ట్-కె, రామ్చరణ్-శంకర్ చిత్రాలకు సంభాషణలు రాస్తున్నా. అలాగే అర్జున్ దర్శకత్వం వహించే సినిమా, కేఎస్ రామారావుగారితో ఓ సినిమాకు పనిచేస్తున్నా’ అని చెప్పారు.