‘నటన, దర్శకత్వం రెండు విభిన్నం. దర్శకుడిగా ఆర్టిస్టుల నుంచి నటనను రాబట్టుకోవాలి. నటుడిగా ఉన్నప్పుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నప్పుడు నాదృష్టంతా కేవలం నటనపైనే ఉం టుంది. దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ ఉంటుంది’ అన్నారు. దునియా విజయ్. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు ఈ కన్నడ నటుడు . ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దునియా విజయ్ పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు గోపీచంద్ ఈ చిత్రంలో నా పాత్ర గురించి చెప్పగానే చాలా థ్రిల్గా అనిపించింది. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి. సినిమాకు ఒక పిల్లర్లా ఆ పాత్ర ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే విలన్ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. ‘వీరసింహా రెడి’్డ చిత్రం అభిమానులకు, ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ జర్నీ.
బాలకృష్ణతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయన అంకితభావం, నటనలో ఆయన ఎనర్జీ గొప్పగా ఉంది. ఈ చిత్రంతో నటుడిగా నా స్థాయి మరింత పెరుగుతుందని అనుకుంటున్నాను. తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు.