“16ఏళ్ల వాసు అనే కుర్రాడు 55ఏళ్ల ‘మట్కా’ కింగ్లా ఎలా మారాడు? అనేది ఈ కథ. మంచి టీమ్తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గొప్ప దర్శకుడు కరుణకుమార్. నాలోని నటుడ్ని కొత్తగా చూపించారాయన. సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నా. విశాఖపట్టణం అంటే సముద్రం గుర్తుకురావాలి. లేదా వాసుగాడు గుర్తుకురావాలి. ఈ డైలాగ్కి తగ్గట్టే సినిమా ఉంటుంది.” అని వరుణ్తేజ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన పీరియాడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మట్కా’. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలు. కరుణకుమార్ దర్శకుడు. డాక్టర్ విజయేందర్రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదలకానుంది.
ఈ సందర్భంగా వైజాగ్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్తేజ్ మాట్లాడారు. దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ ‘వైజాగ్కు మనకు తెలీని చరిత్ర ఉంది. దాన్ని మీకు చూపించబోతున్నా. వైజాగ్ అనేది యారాడకొండ కింద ఉండే చిన్న మత్స్యకార గ్రామం. ఇప్పుడు ప్రపంచపటంలో ఓ సూపర్ పవర్. ముంబైకీ, వైజాగ్కీ దగ్గర పోలికలుంటాయి. ముంబైలో సెటిలర్స్ ఎక్కువ. అలాగే వైజాగ్లోనూ సెటిలర్స్ ఎక్కువ. కానీ వైజాగ్లో పుట్టి పెరిగి, వైజాగ్ మట్టిగా మారిపోయిన చాలామంది జీవితాలు ఈ జనరేషన్కి తెలీదు. ఆ జీవితాలను రీక్రియేట్ చేసి చూపించే ప్రయత్నమే ‘మట్కా’. ఒకనాటి వైజాగ్ నేరసామాజ్యం కూడా ఇందులో ఉంటుంది. మనిషిలోని మంచీచెడుని డిస్కస్ చేసే సినిమాఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని చెప్పారు. నిర్మాతలుకూడా మాట్లాడారు. యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.