దక్షిణాది సినిమా జోరుకు బాలీవుడ్ వెనకబడుతున్న పరిస్థితిపై భిన్నంగా స్పందించారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. ఆయన కొత్త సినిమా ‘జుగ్ జుగ్ జియో’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వరుణ్ ధావన్ సౌత్ సినిమాకూ ఇటీవల వరుస ఫ్లాపులు వచ్చాయన్నారు. కియారా అద్వానీ నాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. రాజ్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్ కపూర్, నీతూ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ…‘పాండమిక్ వల్ల రెండున్నరేళ్లుగా మన సినిమా రిలీజ్లు ఆగిపోయాయి. ఈ మధ్యే ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆదరణ పొంది ఉండకపోవచ్చు. కానీ మనకూ మంచి సినిమాలు వస్తాయి. దక్షిణాది సినిమా అపజయమెరుగనిది అనుకోలేం. అక్కడా ఇటీవల 7,8 సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. చెడ్డ సినిమాను ఏ ప్రేక్షకుడూ చూడాలనుకోడు. అలాగే మంచి సినిమా ఏ భాషలో వచ్చినా వదులుకోడు’ అని అన్నారు.