టాలీవుడ్కు సంక్రాంతి, సమ్మర్ సీజన్ల తరహాలో దసరా సీజన్ కూడా చాలా ముఖ్యమైనదే. ఈ పండుగకు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కావలసి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల వలన వాయిదా వేశారు. దీంతో నాలుగైదు సినిమాలు దసరా బరిలో నిలిచాయి. ముందుగా అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం, అదేరోజున అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలవుతున్నాయి.
మరోవైపు అక్టోబర్ 14న అజయ్ భూపతి మల్టీస్టారర్ మూవీ మహాసముద్రం విడుదల కానుంది.తాజాగా యువ హీరో నాగశౌర్య కూడా దసరా బరిలో నిలుస్తున్నాడు.కొద్ది సేపటి క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న చిత్రాన్నివిడుదల చేయనున్నట్టు తెలియజేశారు. నాగశౌర్య-రీతూ వర్మ కాంబినేషన్ లో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అందిస్తున్న సినిమా వరుడు కావలెను.
ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ ప్రామిసింగ్ గా వుండడంతో కొంత బజ్ వచ్చింది. ఈ సినిమాలోని ‘మనసులోనే నిలిచిపోకే’ అనే మెలొడీ ఎంతగానో ఆకట్టుకుంది.డీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో నాగ శౌర్య మంచి హిట్ కొడతాడని భావిస్తున్నారు. మొత్తానికి ఈ దసరా సీజన్కు బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.