వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్లో చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ..‘వైష్ణవ్ తేజ్కు కథ చెప్పి తిరిగొస్తుంటే చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా అనుకోవచ్చు. వైష్ణవ్ తేజ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఇప్పటిదాకా కనిపించని విధంగా ఉంటారు.
రాధ పాత్రలో కేతిక శర్మ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ రెండు పాత్రలు సినిమాకు ప్రాణం. ఈ సినిమా చూశాక మంచి అనుభూతితో బయటకొస్తారు’ అన్నారు. ‘టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా ఇలాగే మిమ్మల్ని మెప్పిస్తుంది. నా కెరీర్లో కొత్త తరహా సినిమా అవుతుంది. ఈ చిత్రంలో నటించడాన్ని ఆస్వాదించాను’ అన్నారు హీరో వైష్ణవ్ తేజ్. నాయిక కేతికా శర్మ మాట్లాడుతూ..‘ఇదొక ఫీల్గుడ్ మూవీ. ఇందులో నాకు నటించే అవకాశం రావడం అదృష్టం. రాధ పాత్రను మీరంతా ఇష్టపడతారు’ అని చెప్పింది. ‘మెగా హీరోలందరితోనూ సినిమాలను నిర్మించాను. వైష్ణవ్ తేజ్తో ఈ సినిమా చేశాను. నా గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ చంద్ర,బాపినీడు పాల్గొన్నారు.