హైదరాబాద్ : సాధారణంగా ఎవరైనా హీరో బ్లాక్ బస్టర్ అందుకుంటే తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. అది మెగాహీరో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతుంది. ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఈ సినిమా విడుదలకు ముందే క్రిష్తో రెండో సినిమా పూర్తి చేశాడు. కొండపాలెం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం పూర్తిగా గ్లామర్ లేకుండా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆరు నెలలు గడిచిపోయింది. కానీ ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. మధ్యలో కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులపాటు కొండపాలెం సినిమా గురించి ఎవరూ ఆలోచించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుండడంతో దర్శకుడు క్రిష్ కూడా ఈ సినిమాను లైట్ తీసుకున్నాడు. ఇక హీరో వైష్ణవ్ తేజ్ కూడా తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలో కొండపాలెం ఓ రకంగా చెప్పాలంటే సందిగ్ధావాస్తలో పడింది. బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా రెండో సినిమా విషయంలో వైష్ణవ్కు తిప్పలు తప్పడం లేదు. దాంతో ఈ సినిమాను థియేటర్లలో కంటే కూడా ఓటీటీలో విడుదల చేయడం మంచిదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఓటీటీ సంస్థలతో నిర్మాతలు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ వాళ్లు ఊహించినంత రేట్ మాత్రం రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే వచ్చినంతకు ఇచ్చేయాలని నిర్మాతలు నిశ్చయించుకున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మొదటి సినిమాతో అంతటి విజయం అందుకున్న తర్వాత రెండో సినిమాకి ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగానే విచిత్రంగా అనిపిస్తుంది.