Vaarasudu Movie Gets Post Poned | మరో రెండు రోజుల్లో విడుదల కావాల్సిన వారసుడు చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా దిల్రాజు వారసుడు సినిమాను మూడు రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు ఎక్కువ థియేటర్లను కావాలని తనే ఒక అడుగు వెనక్కి వేసినట్లు తెలిపాడు. అయితే తమిళ వెర్షన్ ముందుగా ఫిక్స్ చేసిన తేదీకే రిలీజవుతుందని, కేవలం తెలుగులోనే విడుదల తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. అయితే ఎప్పుడు రిలీజైన ‘వారసుడు’ బ్లాక్బస్టర్ అవుతుందని తెలిపాడు.
గతంలో సంక్రాంతి సీజన్కు తమ బ్యానర్ నుండి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఎఫ్-2 వంటి సినిమాలు ఎలా విజయాలు సాధించాయో.. వారసుడు కూడా అదే విధంగా ఈ సంక్రాంతికి మంచి విజయం సాధిస్తుందని తెలిపాడు. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉందని తెలిపాడు. సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆ పాయింట్నే గుర్తు పెట్టుకుంటారని దిల్రాజు వెల్లడించాడు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదలతో వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు ఓపెనింగ్స్ భారీ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది.