సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి (48) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుప్రతిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. బసవతారకం ఆసుపత్రి నుంచి పద్మావతి భౌతిక కాయాన్ని అల్లాపూర్ డివిజన్ ప్రాంతం గాయత్రీనగర్లోని ఉత్తేజ్ నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ నటులు ఉత్తేజ్ నివాసానికి చేరుకొని పద్మావతి పార్థివ దేహానికి నివాళులర్పించి ఉత్తేజ్ కుటుంబాన్ని ఓదార్చారు. అగ్ర నటుడు చిరంజీవి బసవతారకం ఆసుపత్రిలో ఉత్తేజ్ను పరామర్శించారు. చిరంజీవిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేక ఉత్తేజ్ ఆయన్ని పట్టుకొని విలపించడం అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది. జీవిత రాజశేఖర్, ప్రకాష్రాజ్, బ్రహ్మాజీ తదితరులు ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పద్మావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే ఉత్తేజ్ స్థాపించిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలను పద్మావతే చూసుకునేవారు. ఫిల్మ్నగర్లోని మహప్రస్థానంలో పద్మావతి దహన సంస్కారాలను నిర్వహించారు.