రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమాకు కొత్త నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యాప్తి చేస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పష్టం చేసింది. కొంతమంది వ్యక్తులకు గానీ, ఏజెన్సీలకు గానీ తమ చిత్రంలో నటీనటులను ఎంపిక చేసే హక్కు ఇవ్వలేదని ఆదివారం విడుదల చేసిన ప్రెస్నోట్లో పేర్కొంది.
నిర్మాణ సంస్థ స్పందిస్తూ…‘రామ్ చరణ్ 15వ సినిమా, మా సంస్థలో 50వ సినిమా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయడం లేదు. ఎవరైనా అవకాశాలు ఇస్తామని చెబితే నమ్మకండి.
ఈ అసత్య వార్తలను మా సంస్థ ఖండిస్తోంది. మా సినిమాలో నటీనటులను ఎంపిక చేసే బాధ్యతను ఏ వ్యక్తికీ, ఏ సంస్థకూ ఇవ్వలేదు’ అని పేర్కొంది. రాజకీయ నేపథ్య కథలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది.