‘జాతిరత్నాలు’ చూసి నవీన్ పోలిశెట్టి అభిమానిని అయ్యాను. కథ అతనికే చెబుదామనుకున్నాను. కుదర్లేదు. కొందరు మిత్రులు కిరణ్ అబ్బవరం పేరు సూచించారు. కథ నచ్చడంతో కిరణ్ ఓకే చెప్పాడు. రషస్ చూశాక నా అంచనాలకు మించి చేశాడు అనిపించింది.’ అని దర్శకుడు రత్నంకృష్ణ అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా రత్నంకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మాతలు.
ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రత్నంకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ‘ ‘ఆక్సిజన్’ తర్వాత కామెడీ సినిమా చేయాలని ‘రూల్స్రంజన్’ కథ రెడీ చేసుకున్నాను. ఫస్టాఫ్ యూత్ఫుల్గా, సెకండాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉంటుంది. ఆద్యంతం నవ్వించే సినిమా ఇది’ అని రత్నంకృష్ణ చెప్పారు. ‘ఇటీవలే అందరం కలిసి సినిమా చూశాం. అందరూ హ్యాపీ. అందరూ మెచ్చే సినిమా అవుతుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు రత్నంకృష్ణ.