ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసారు. అమీర్పేట్ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఐదుగురు దుండగులు బూతులు తిడుతూ దాడి చేసినట్టు స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో పోసానితో పాటు కుంటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాని ఈ ఘటనతో పోసాని ఇంటి వాచ్మెన్ సహా కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. పోసాని పైన దాడి చేస్తాం..ఆయన్ను వదిలేది లేదంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారని ఆ నివాసంలో ఉంటున్న వాచ్ మెన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో పది మంది వరకు ఉన్నారని..తాము ఆ దాడి నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక, వీరు చెబుతున్న సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
కాగా, పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. దీనికి స్పందనగా ఏపీ మంత్రులతో పాటుగా వైసీపీ మద్దతు దారుడిగా ఉన్న పోసాని సైతం స్పందించారు. పవన్ పైన సంచలన ఆరోపణలు చేసారు. ఈ క్రమంలో ఆయనపై కొందరు పవన్ అభిమానులు దాడులు చేసినట్టు తెలుస్తుంది.