జానపద హారర్ జోనర్లో రూపొందిన ‘తుంబాడ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ను రూపొందిస్తున్నారు. సోహుమ్షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదేశ్ ప్రసాద్ దర్శకుడు. శాపగ్రస్త దేవత హస్తార్ చుట్టూ అల్లుకున్న పురాణగాథ నేపథ్యంలో సీక్వెల్ కథ సాగుతుందని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అగ్ర కథానాయిక అలియాభట్ కీలకమైన అతిథి పాత్రలో నటించనుందని తెలిసింది. తొలి భాగానికి లభించిన ఆదరణతో పాటు సీక్వెల్పై నెలకొన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని అలియాభట్ ఈ సినిమాలో భాగం కావడానికి అంగీకరించిందని బాలీవుడ్ టాక్. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. కథాగమనంలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.