SSMB28 | అసలే చాలా రోజులు ఎదురు చూపుల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఈ సినిమాను పూర్తి చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. నిజానికి 2022 నవంబర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో మహేశ్ బాబు అమ్మ ఇందిరా చనిపోవడం.. ఆ మరణం నుంచి ఆయన కోలుకోక ముందే కృష్ణ కూడా కన్నుమూయడంతో 2022 మొత్తంలో త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టాడు మహేశ్ బాబు. జనవరిలో షూటింగ్ మొదలుపెడదామని అనుకున్న కూడా మూడో వారానికి కానీ డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడు.
మొదటి షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం రెండో షెడ్యూల్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.. మహేశ్ బాబు సినిమా హైదరాబాద్లోనే పూర్తిగా షూటింగ్ చేయనున్నారు. దీని కోసం అవుట్ డోర్ షూటింగ్స్ ఏమీ ప్లాన్ చేయలేదు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ ఇంటి సెట్తో పాటు మరో మూడు అత్యంత ఖరీదైన సెట్లు వేస్తున్నారు. కేవలం వీటి కోసమే 30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. సినిమా షూటింగ్ అంతా వీటిలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.
అది కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అయితే ఫిబ్రవరి 10న తన పెళ్లి రోజు కోసం కుటుంబంతో పాటు స్విట్జర్లాండ్ వెళ్లాడు మహేశ్. ఫిబ్రవరి 18 ఆయన ఇండియాకు రానున్నాడు. 20వ తేదీ నుంచి మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతాడు. అయితే మహేశ్ బాబు లేని ఈ 10 రోజులు కూడా షూటింగ్ ఆగకూడదని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. మహేశ్ లేని సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందు ఆగస్టు 11 కు అనుకున్న కూడా అప్పటివరకు షూటింగ్ అయ్యేలా కనిపించడం లేదు. హడావిడిగా విడుదల చేసి అనవసరంగా అవుట్ పుట్ మీద ప్రభావం పడేకంటే.. కాస్త టైం తీసుకుని రావాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి మహేష్ ఉన్నా లేకపోయినా షూటింగ్ మాత్రం ఆపొద్దు అనేది త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయం.